header

Saturday 19 November 2016

ముర్గ్‌ దమ్‌ బిర్యానీని

ముర్గ్‌ దమ్‌ బిర్యానీని


కావలసినవి:
 బాస్మతి బియ్యం- ఒక కేజీ, చికెన్‌ - ఒక కేజీ (లెగ్‌, చెస్ట్‌పీస్‌లు) ,పెరుగు- 200 గ్రాములు , నిమ్మరసం- మూడు టీ స్పూన్లు ,కారం - 20 గ్రాములు, ధనియాల పొడి- 30 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 100 గ్రాములు, ఉప్పు- 50 గ్రాములు, గరంమసాలా- 20 గ్రాములు, రిఫైన్డ్‌ ఆయిల్‌- 100 గ్రాములు, వేగించిన ఉల్లి ముక్కలు (సన్నగా నిలువుగా కోసి.) - 30 గ్రాములు, జీడిపప్పు - కొద్దిగా, కొత్తిమీర తరుగు - 15 గ్రాములు, పుదీనా తరుగు - 15 గ్రాములు
బిర్యానీ ఆకులు- ఐదు గ్రాములు, డాల్డా లేదా నెయ్యి - 150 గ్రాములు, నీళ్లు- ఐదు లీటర్లు. ఈ కొలతలతో వండిన బిర్యానీ ఎనిమిది మందికి సరిపోతుంది.
తయారీ:
 చికెన్‌ను ఒక గిన్నెలో వేసి అందులో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు కొన్ని, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, నూనె వేసి కలపాలి. ఇలా కలిపిన చికెన్‌ని రెండు నుంచి మూడుగంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లుపోసి, గరంమసాలా పొడి వేయాలి. నీళ్లు ఉడుకు పట్టాక కడిగిపెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి సగం ఉడికించాక ఎసరు వంపేయాలి. అన్నివైపులా సమానంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని నానబెట్టిన చికెన్‌ను ఒక పొరలా వేయాలి. దానిపైన సగం ఉడికిన బియ్యాన్ని వేయాలి. పైన కొంచెం నెయ్యి వేయాలి. ఈ గిన్నెను ఒక తవాపై ఉంచి సన్నటి మంట మీద 25 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, మూతను కలిపి మైదాతో మూసేయాలి. మండుతున్న బొగ్గులు మూతమీద వేయాలి. 20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. ఈ ముర్గ్‌ దమ్‌ బిర్యానీని రైతా, మిర్చి కా సలాన్‌తో కలిపి తింటే బాగుంటుంది.

ఆలు చికెన్‌ బిర్యానీ

ఆలు చికెన్‌ బిర్యానీ



కావలసిన వస్తువులు:
 చికెన్‌: అరకిలో. సగం ఉడికిన అన్నం: ఒకటిన్నర కిలో, ఆలు: నాలుగు లేదా ఐదు(కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి), దాల్చిన చెక్క: చిన్న ముక్క, యాలకులు: నాలుగు లేక ఐదు, మిరియాలు: కొన్ని, బిర్యానీ ఆకు: కొద్దిగా, పచ్చిమిర్చి: ఎనిమిది, ఉల్లిపాయ ముక్కలు: రెండు కప్పులు, కారం: సరిపడ, నిమ్మరసం: టేబుల్‌ స్పూను, కొత్తిమీర ఆకులు: కప్పు, కుంకుమపువ్వు: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్లు
తయారీ విధానం: 
ముందుగా బియ్యాన్ని సగం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఓ పెద్ద గిన్నెలో చికెన్‌ ముక్కలు, కారం, ఉప్పు, నిమ్మరసం, చిటికెడు పసుపువేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ లేదా పాన్‌లో నూనె వేసి బంగాళాదుంప ముక్కలను కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో పచ్చిమిరపకాయలు, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించుకోవాలి. వీటికి ఉల్లిపాయ ముక్కలు జతచేర్చి మరికొద్దిసేపు వేయించి అనంతరం అల్లం వెల్లుల్లిముద్ద కూడా జతచేయాలి. అన్నీ వేగిన తరువాత చికెన్‌ ముక్కలు వేసి మరికొద్ది సేపు వేయించి చివరగా బంగాళాదుంప ముక్కలు జతచేయాలి. ఉడికిన అన్నాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం మీద వేయించి పెట్టుకున్న మిశ్రమంలో సగభాగాన్ని తీసుకుని లేయర్‌గా పరుచుకోవాలి. దానిపైన మిగతా అన్నం వేసి మిగతా కూరను కూడా పరిచి కుక్కర్‌లో ఒకటి లేదా రెండు విజిల్స్‌ మాత్రమే వచ్చేవరకు ఉంచి దింపేయాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.